ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 1,813 కరోనా కేసులు నమోదు కాగా, 17 మంది మరణించారు.
ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తూనే ఉంది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టెస్టుల సంఖ్య పెంచే కొద్ది.. కేసులు బయటపడటం ఆందోళనల కలిగిస్తోంది. శనివారం తాజా బులిటెన్లో మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,590 మందికి పరీక్షలు నిర్వహించగా 1775 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన నలుగురికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఒక్క రోజే మొత్తం కేసులు 1813కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 27,235కు చేరింది.
గడచిన 24 గంటల్లో 17 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 309కి చేరింది. గత 24 గంటల్లో 1168 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలోని నమోదైన మొత్తం 27,235 పాజిటివ్ కేసులకు గాను 12,399 మంది డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,714కు చేరుకుంది. అలాగే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారితో కలిపితే 12,533 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గత 24 గంటల్లో అత్యధికంగా అనంతపురం జిల్లాలో 311 కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 300, కర్నూలులో 229, తూర్పుగోదావరి జిల్లాలో 143, పశ్చిమ గోదావరి జిల్లాలో 84, గుంటూరు జిల్లాలో 68, ప్రకాశం జిల్లాలో 63, కడప జిల్లాలో 47, విశాఖపట్నం జిల్లాలో 51, విజయనగరం జిల్లాలో 76, శ్రీకాకుళం జిల్లాలో 204, కృష్ణా జిల్లాలో 123, నెల్లూరు జిల్లాలో 76 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో మొత్తం 3,168 పాజిటివ్ కేసులు.. తర్వాత అనంతపురం జిల్లాలో కేసులు 3,161, గుంటూరు జిల్లాలో 2867 కేసులు నమోదయ్యాయి.