Ap Three Capitals బిల్లులు: కేబినెట్ టు అసెంబ్లీ.. గవర్నర్ ఆమోదం ఇలా


ఏపీలో మూడు రాజధానులకు బీజం ఎప్పుడు పడింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఎప్పుడేం జరిగిందో ఓసారి చూద్దాం. 2019 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో పరిశీలిస్తే.



ఏపీలో మూడు రాజధానుల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రభుత్వం కూడా స్పీడు పెంచి.. విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. నిపుణుల కమిటీ నుంచి గవర్నర్ ఆమోదం వరకు పదిన్నర నెలల్లో ఆమోద ప్రక్రియ పూర్తి చేశారు. ఈ మూడు రాజధానులకు బీజం ఎప్పుడు పడింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఎప్పుడేం జరిగిందో ఓసారి చూద్దాం.
ముందుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులపై అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది.

2019 సెప్టెంబర్‌ 13న రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు రిటైర్డు ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు. 2019 డిసెంబర్‌ 20న రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని. అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేటివ్‌ కేపిటల్‌), విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ (పరిపాలన రాజధాని), కర్నూలులో జ్యుడిషియల్‌ కేపిటల్‌ (న్యాయ రాజధాని) ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి జీఎన్‌ రావు కమిటీ నివేదిక అందజేసింది.

2019 డిసెంబర్‌ 27న జీఎన్‌ రావు కమిటీ నివేదిక, బీసీజీ(బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌) నివేదికలపై అధ్యయనం కోసం హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2019 డిసెంబర్‌ 29న హైపవర్‌ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా.. 2020 జనవరి 3న రాష్ట్ర సమగ్ర, సమతుల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణ ఏకైక మార్గమని పేర్కొంటూ మూడు రాజధానుల ఏర్పాటుకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి బోస్టన్‌ కన్సెల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) నివేదిక ఇచ్చింది. 2020 జనవరి 17న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హైపవర్‌ కమిటీ నివేదిక ఇచ్చింది.

2020 జనవరి 20న హైపవర్‌ కమిటీ నివేదికపై చర్చించి పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. బిల్లును ఆమోదించారు. తర్వాత 2020 జనవరి 22న శాసనసభ ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించకుండా శాసనమండలిలో సెలక్ట్ కమిటీకి పంపించారు. తర్వాత 2020 జూన్‌ 16న అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మరోసారి అసెంబ్లీ ఆమోదించింది. 2020 జూన్‌ 17న శాసనసభ రెండోసారి ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా నిరవధికంగా వాయిదా పడింది.

2020 జూలై 18న శాసనమండలిలో రెండుసార్లు ఆమోదించని బిల్లుల్ని.. శాసనమండలితో పనిలేకుండా బిల్లుల్ని గవర్నర్‌ ఆమోదం కోసం పంపించారు. 2020 జూలై 31న పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. సీఆర్‌డీఏ స్థానంలో ‘ఏఎంఆర్‌డీఏ’ఊసీఆర్‌డీఏ (క్యాపిటల్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) రద్దు బిల్లును గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదించడంతో ఇక ఆ సంస్థ కనుమరుగుకానుంది. ఆ స్థానంలో ఏఎంఆర్‌డీఏ (అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) ఏర్పాటు కానుంది. సీఆర్‌డీఏ కార్యకలాపాలన్నీ ఇకపై ఏఎంఆర్‌డీఏ నిర్వహిస్తుంది. సీఆర్‌డీఏ ఉద్యోగులంతా ఏఎంఆర్‌డీఏ ఉద్యోగులుగా మారతారు. భూ సమీకరణ సహా రాజధాని వ్యవహారాలన్నీ ఈ సంస్థే నిర్వహిస్తుంది.